వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన.. ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డ్

వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన.. ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డ్

2024 సంవత్సరానికిగానూ మెడిసన్ విభాగంలో నోబెల్ అవార్డు విజేతల పేర్లను స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్శిటీ ప్రకటించింది. జన్యు నియంత్రణలో మైక్రో ఆర్‌ఎన్‌ఏ పాత్రపై చేసిన పరిశోధనలకుగానూ అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ వైద్యశాస్త్రంలో‎ సంయుక్తంగా నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ కమిటీ ఇవాళ ( 2024, అక్టోబర్ 7) ప్రకటన చేసింది. వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్‎కు ఎంపికైన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ 1.1 మిలియన్ డాలర్ల నగదు పురస్కారం అందుకోనున్నారు. 

ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం మెడిసిన్ విభాగానికి సంబంధించిన విజేతల పేర్లనే నోబెల్ సెలక్షన్ మొదటి ప్రకటించింది. తర్వాత సైన్స్, సాహిత్యం, ఆర్థిక, శాంతి రంగాలకు సంబంధించి విజేతల పేర్లను అనౌన్స్ చేయనున్నారు. అక్టోబర్ 14వ తేదీ వరకు అవార్డుల ప్రకటన కొనసాగనుంది. స్వీడిష్ కు చెందిన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా 1901 నుండి ప్రతి సంవత్సవరం నోబెల్ అవార్డులను ప్రధానం చేస్తోన్న విషయం తెలిందే.

ALSO READ | ఈసారి ట్రంప్​ గెలవకుంటే అంతే: ఎలాన్ మస్క్​సంచలన కామెంట్స్

ప్రపంచవ్యాప్తంగా వైద్యం, సైన్స్, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు నోబెల్ అవార్డులు ఇస్తున్నారు. తర్వాత ఆర్థిక రంగంలో కూడా ఈ అవార్డ్‎ను అందజేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఐదు రంగాల్లో నోబెల్ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. డిసెంబర్ 10 ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోమ్‎లో విజేతలకు అవార్డులను ప్రధానం చేస్తారు. అయితే శాంతి రంగానికి చెందిన అవార్డ్‎ను మాత్రం స్టాక్ హోమ్‎లో కాకుండా ఓస్లోలో విజేతకు అందజేస్తారు.