
ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా కేసులు భారీగా బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 12,613 మంది శాంపిళ్లను పరీక్షించగా 115 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 3,791. కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 64కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,209కి చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 927 మంది చికిత్స పొందుతున్నారు.