తెలంగాణలో మరో 18 డయాలసిస్ సెంటర్లు

తెలంగాణలో  మరో 18 డయాలసిస్ సెంటర్లు
  • ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్ మెషీన్లు 
  • కొత్తగా ఏడు వాస్క్యులర్ సెంటర్ల   ఏర్పాటు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఊరట కల్పించేలా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు వాస్క్యులర్ సెంటర్లు, 18 డయాలసిస్‌‌ సెంటర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్‌‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రెండు మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు డయాలసిస్‌‌ అవసరం అవుతుంది. తొలిసారి డయాలసిస్‌‌ చేయాల్సి వచ్చినప్పుడు రోగికి మొదట ఒక శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డయాలసిస్‌‌కు యాక్సెస్‌‌ పాయింట్‌‌ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేస్తారు.

 రక్తప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వ్యాస్కులర్‌‌ సర్జన్‌‌ ఈ సర్జరీ చేస్తారు. ఒక్కసారి ఈ యాక్సెస్‌‌ పాయింట్‌‌ను ఏర్పాటు చేయించుకుంటే.. ఆ తర్వాత డయాలసిస్‌‌ చేయడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఈ వాస్క్యులర్‌‌ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు కచ్చితంగా హైదరాబాద్‌‌ రావాల్సిన పరిస్థితి ఉంది. దీని వల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం అవడంతోపాటు, నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా వాస్క్యులర్‌‌ యాక్సెస్‌‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జనరల్ హస్పిటల్, వరంగల్‌‌ ఎంజీఎం, మహబూబ్‌‌నగర్‌‌ జనరల్ హాస్పిటల్‌‌, ఆదిలాబాద్ రిమ్స్‌‌లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్‌‌లో డయాలసిస్‌‌ కోసం నిమ్స్‌‌, గాంధీ, ఉస్మానియాలలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తం 7 సెంటర్ల కోసం రూ.32.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. డయాలసిస్‌‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 85 కేంద్రాలున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా18 డయాలసిస్‌‌ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 మిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఇప్పటికే ఉన్న సెంటర్లపై భారం తగ్గడంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే సెంటర్లతో పేషెంట్లు ప్రయాణించాల్సిన దూరం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.