![బిగుస్తున్న ఉచ్చు.. వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం](https://static.v6velugu.com/uploads/2025/02/another-two-cases-to-reopen-on-vallabhaneni-vamshi_g0j7FCh6Xq.jpg)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధమైంది. 2019 ఎన్నికల సందర్భంగా నకిలీ పట్టాల పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అప్పట్లో ఈ కేసులో వంశీ పాత్ర లేదని పోలీసులు తేల్చేశారు.
దీనిపై అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ కేసు రీఓపెన్ చేయమని పిటిషన్ వేశారు. యార్లగడ్డ పిటిషన్తో కేసులపై పునర్విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదేవిధంగా వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వచాయి. ఫిర్యాదులపై విచారణ చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రూ.210 కోట్ల వరకు మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదిక ద్వారా వెల్లడించింది.
రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా తవ్వకాలు జరిపినట్లు విజిలెన్స్ నివేదికలో తెలిపింది. తవ్వకాలు, జరిమానాలు మొత్తం రూ.210 కోట్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఫైళ్లను రీఓపెన్ చేసి కేసును ఏసీబీ లేదా సీఐడీకి అప్పగించే అవకాశం ఉంది.