
బైక్ నడపడం అంటే అతనికి చాలా ఇష్టం. కానీ.. బతకాలంటే డబ్బు కావాలి. బైక్ రైడ్స్ చేస్తే డబ్బు ఖర్చవుతుంది! కానీ.. సంపాదించలేం అనుకుని.. తండ్రిలా టీచర్ కావాలి అనుకున్నాడు. అప్పుడే యూట్యూబ్ వల్ల అతనికి నచ్చిన పని చేస్తూనే డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చింది. మోటో వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడే విధానం, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను వివరించే పద్ధతి అందరికీ నచ్చాయి. అందుకే ఫేమస్ యూట్యూబర్ అయ్యాడు. ఇప్పుడు బైక్ రైడ్స్, వ్లాగ్స్ చేస్తూనే లక్షల్లో సంపాదిస్తున్నాడు.
అనురాగ్ దోభాల్.. యూట్యూబ్ ప్రపంచంలో అతని చానెల్ పేరు ‘‘ది యూకే07 రైడర్’’తో గుర్తింపు పొందాడు. అతను ఇండియాలోని టాప్ మోటో వ్లాగర్స్లో ముందువరుసలో ఉంటాడు. అనురాగ్ రెగ్యులర్గా కార్ ట్రిప్స్, బైక్ రైడ్స్, అడ్వెంచర్స్తోపాటు వ్లాగ్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. అతని వీడియోలకు ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులు ఉన్నారు.
ఆరేళ్ల వయసులో..
అనురాగ్ దోభాల్ 1997 సెప్టెంబర్ 18న ఉత్తరాఖండ్లోని డెహ్రాదూన్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి జగదాంబ ప్రసాద్ దోభాల్ కాలేజీ లెక్చరర్. తల్లి అతుల్ దోభాల్ ఇంటిని చూసుకునేది. అనురాగ్ అనారోగ్యం వల్ల చిన్నప్పటినుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతనికి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు చెప్పారు.
అసలే వాళ్లది మధ్య తరగతి కుటుంబం కావడంతో ట్రీట్మెంట్ చేయించడానికి ఆర్థికంగా చాలా ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలు ఎదురైనా అతని తల్లిదండ్రులు అనురాగ్ని కాపాడుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారు. పూర్తిగా కోలుకునే టైంకి తన వయసు 14 ఏళ్లు. అప్పుడు ఎదుర్కొన్న సవాళ్లే అనురాగ్కు ధైర్యం, పట్టుదలను నేర్పాయి.
టీచర్ కావాలనుకుని..
అనురాగ్ స్కూల్ ఎడ్యుకేషన్ డెహ్రాడూన్లోని ది ఏషియన్ స్కూల్లో పూర్తయ్యింది. ఆ తర్వాత పై చదువుల కోసం హేమవతి నందన్ బహుగుణ గర్హ్వాల్ యూనివర్సిటీలో చేరాడు. అతనికి చిన్నప్పటి నుంచి బైక్లు నడపడమంటే ఇష్టం. దాంతోపాటు తన తండ్రిలాగే టీచర్ కావాలని కలలు కన్నాడు. అందుకే 2014లో ట్యూషన్ టీచర్గా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ.. 2018లో అతని జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. దాంతో టీచింగ్ కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టి, రైడర్గా జీవితాన్ని ప్రారంభించాడు.
యూట్యూబ్ ప్రయాణం
అనురాగ్ 2015లోనే ‘ది యూకే 07 రైడర్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టినప్పటికీ 2018 నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ.. యాక్టివ్గా ఉంటున్నాడు. జనవరి 1న అనురాగ్ మొదటి వీడియోని పోస్ట్ చేశాడు. అదే నెల 14వ తేది నాటికి సబ్స్క్రయిబర్ల సంఖ్య 100కి చేరింది. ఆ తర్వాత ప్రతినెలా పెరుగుతూ వచ్చింది. మరుసటి సంవత్సరం ఆ సంఖ్య లక్ష దాటింది.
అనురాగ్ తన కేటీఎం బైక్తో దేశవ్యాప్తంగా రైడ్స్ చేస్తుంటాడు. ఆ ప్రయాణాలను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. అతని మొదటి వీడియోలో ఉత్తరాఖండ్ అందాలను చూపించాడు. అయితే.. పాకిస్తాన్లోని కర్తార్పూర్ కారిడార్ రైడ్ వీడియోతో చాలా గుర్తింపు వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతోపాటు చానెల్కు చాలామంది సబ్స్క్రయిబర్లను తీసుకొచ్చింది.
బ్రో సేన
అనురాగ్ తన ఫాలోవర్స్ని ‘‘బ్రో సేన” అని పిలుస్తుంటాడు. వాళ్లలో చాలామంది అతన్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అందుకే కొంతమంది డబ్బు చెల్లించి మరీ చానెల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం చానెల్ను 7.84 మిలియన్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. చానెల్లో ఇప్పటివరకు 11 వందల వీడియోలు అప్లోడ్ చేశాడు. మరో ప్రత్యేకత ఏంటంటే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ షార్ట్ వీడియోలతో పాపులర్ అవుతుంటే అనురాగ్ మాత్రం ఇప్పటివరకు ఒక్క షార్ట్ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు.
ఫ్యామిలీ వ్లాగ్స్ అప్లోడ్ చేసేందుకు ‘బాబు భయ్యా’ పేరుతో రెండో చానెల్ కూడా పెట్టాడు. దాన్ని ఇప్పటివరకు 4.13 లక్షల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. ఈ రెండు చానెళ్ల నుంచి, బ్రాండ్ స్పాన్సర్షిప్ల ద్వారా అతనికి ఆదాయం వస్తోంది. అతని ఆస్తుల విలువ మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందనేది ఒక అంచనా. లంబోర్ఘిని, సుప్రా లాంటి లగ్జరీ కార్లను వాడుతున్నారు అనురాగ్. 2023లో అతనికి ‘‘క్రియేటర్స్ ఫర్ గుడ్”అనే అవార్డు కూడా దక్కింది.
బిగ్బాస్ షో
అనురాగ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతనికి నేపాల్ రైడ్లో పరిచయమైన సవ్య అనే రైడర్తో ప్రేమలో పడ్డాడు. కానీ.. కొన్నాళ్లకు వాళ్లు విడిపోయారు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే 2023లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్–17కి సెలక్ట్ అయ్యాడు. అందులో కూడా అతనికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
అతన్ని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ఆరోపణలు చేశాడు. ఆ షో తర్వాత మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడు. అయినప్పటికీ కుటుంబం, ఫాలోవర్స్ సపోర్ట్తో నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం అనురాగ్కు రితికా చౌహాన్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది.