
- లింక్ ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాల ప్రమేయం, పాత్ర లేదు
- డీలిమిటేషన్ వచ్చినప్పుడు చూద్దామన్న ఏపీ సీఎం
- ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, నిర్మలతో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకే వెళ్తాయని, ఆ నీటినే తాము వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పారు. వృథాగా పోయే నీటిని వాడుకునేందుకే నదుల అనుసంధానంతో పోలవరం– -బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పోలవరం–-బనకచర్ల అనుసంధానంతో రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టు గేట్ వే ఆఫ్ రాయలసీమగా నిలుస్తుందన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పోలవరం-–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సహాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరామని తెలిపారు. లింక్ ప్రాజెక్టులో ఇతర రాష్ట్రాల ప్రమేయం, పాత్ర లేదన్నారు. అలాగే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులనూ లింక్ చేయాలన్నారు.
‘‘అమరావతి – అవుటర్ రింగ్ రోడ్డు, వినుకొండ-– అమరావతి రోడ్డు, విశాఖపట్నం-– మూలపేట రోడ్డు, హైదరాబాద్ –- మచిలీపట్నం రోడ్డు వంటి వాటిపై జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించా. హైదరాబాద్– మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవేతో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఉపయోగం. ఇందులో కొత్త రోడ్లకు సంబంధించి డీపీఆర్ పూర్తయిన తరువాత టెండర్లు పిలుస్తాం. కేంద్రం నుంచి పర్యావరణ, ఇతర అనుమతులు రావాల్సి ఉంది.
అలాగే కొన్ని పాలసీల్లో సమస్యలు ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వ సాయంతో అధిగమిస్తాం’’ అని అన్నారు. కాగా, డీలిమిటేషన్పై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. అది ఇప్పుడు రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దామన్నారు. అలాగే నూతన విద్యా విధానంలో భాగంగా ఉన్న త్రిభాషా సూత్రంలో తప్పేమీ లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
ఎక్కువ మంది పిల్లల్ని కనండి..
దేశం సంక్షోభాన్ని ఎదుర్కొబోతోందని, జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. యూపీ, బిహార్ రాష్ట్రాల మాదిరిగా ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. గతంలో తాను జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు ఆ విషయంలో రియలైజ్ అయ్యానన్నారు. మానవ వనరుల అవసరం గుర్తించి, జనాభా పెంచాలని కోరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
జనభాను పెంచిన యూపీ, బిహార్ను స్వాగతిస్తున్నానని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులకు పిల్లలే సంపాదించి పెడతారని చెప్పారు. ఏపీలో రాజకీయ పరిణామాలపై ఎన్డీయే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించానని చంద్రబాబు తెలిపారు. ‘‘గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలైంది.
ఈ బిల్లు ఏపీ శాసనసభ, శాసన మండలిలో కూడా ఆమోదం పొందింది. దీనిని కేంద్రం త్వరగా ఆమోదించాలని కోరాం. ఈ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయి. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ యాక్ట్ కేసులు పెడతాం’’ అని వెల్లడించారు. ‘‘ఏపీలో గంజాయి అనే మాట వినిపించకుండా చేసి, యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటాం. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకొస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.