
మన ఇంటిని బయటి వాళ్లకి అద్దెకు ఇవ్వాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తామని,. అలాంటిది మన ఓటు వేసే వ్యక్తి గురించి మరెన్నో రకాలుగా ఆలోచించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మన ఇంట్లో ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే అనేక రకాలుగా ఆలోచిస్తామన్నారు. చేసుకోబోయే అబ్బాయికి చదువు-సంస్కారం, ఉద్యోగం… ఇవన్నీ ఉంటేనే పిల్లనిస్తామని.. అలాంటిది రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల పాటు పాలించే సీఎం అభ్యర్ధి విషయంలో అన్ని అర్హతలు ఉంటేనే ఓటేస్తామని ఆయన అన్నారు. అవినీతి, అక్రమాల్లో 31 కేసులున్న వాడికి, అరాచకాల పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఓటు వేసే ముందు ఎవరికి వేస్తున్నామో తెలసుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని చంద్రబాబు అన్నారు.