
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే పలు చోట్ల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
- ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు, దాడులు జరిగాయి. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరస్పరం దాడికి దిగాయి ఇరు వర్గాలు.
- దర్శి నగర పంచాయతీ పరిధిలోని 132 పోలింగ్ బూతులో టీడీపీ కార్యకర్తలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దర్శి 2 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి పోలింగ్ బూత్ లో నానా హంగామా సృష్టించి ఈవీఎంను పగులకొట్టారు.
- కడప జిల్లా జమ్మలమడుగులో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, కూటమి కార్యకర్తలు ఎదురుపడటంతో మాటా, మాటా పెరిగి ఇరువర్గాలు దాడికి యత్నించాయి. రెండువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
- అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకుంది. కమాన్ సర్కిల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. పరస్పరం రాళ్ల దాడితో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జిల్లా ఎల్పీ వాహనం కూడా రాళ్ల దాడిలో ధ్వంసమయ్యింది.
- అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించారు టీడీపీ నేతలు. ఇది పద్దతి కాదని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
- ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. తారక రామానగర్ యుపి స్కూల్ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు ఘర్షణ పడ్డారు. ఈ గొడవతో ఓటర్లు భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
- ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కాసేపు పోలింగ్ నిలిపివేశారు అధికారులు.
- పల్నాడు జిల్లా పెదకూరపాడులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అచ్చంపేట పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కర్రలతో దాడులకు దిగారు ఇరుపార్టీల కార్యకర్తలు.
- పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో ఓటర్లను తీసుకు వెళ్లే విషయంలో వైసిపి, టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నెల్లూరి రామకోటయ్యతో పాటు…మరికొందరికి గాయాలయ్యాయి. అటు రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ పోలింగ్ ఏజంట్లపై వైసీపీ నేతలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
- గుంటూరు జిల్లా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలో రమ్మన్నందుకు ఓటర్ పై చేయి చేసుకున్నాడు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్. తిరిగి ఓటర్ కూడా ఎమ్మెల్యే పై చేయి చేసుకున్నాడు. దీంతో శివకుమార్ అనుచరులు ఓటర్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు.
- గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆయన కార్లను ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారుల పైకి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.
- కృష్ణాజిల్లాలో ఉద్రికత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ముస్తాబాద్ ప్లై ఓవర్ వద్ద వల్లభనేని వంశీ... యార్లగడ్ద వెంకట్రావు వర్గీయులు కొట్టుకున్నారు. ఒక వర్గంపై మరో వర్గంచెప్పులు.. రాళ్లు రువ్వుకున్నారు.
- గుంటూరు రాయపాటి వీరయ్య చౌదరి ప్రాథమిక పాఠశాల బూతులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వైసీపీ అభ్యర్థి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారిని అడ్డుకన్నారు.
- దర్శి మండలంలో టీడీపీ .. వైసీపీ కార్యకర్తలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. బొట్లపాలెం గ్రామంలోని 155 వ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఉండగానే టీడీపీ కార్యకర్తలపై .... వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
- విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తశ్రీరంగరాజపురంలో పోలింగ్ కేంద్రంలో పీవోగా ఉన్న రాంబాబు.. ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలతో..అతడిపై దాడికి దిగారు.. వృద్దులు ఓట్లును టీడీపీకి ప్రభావితం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే పీవో రాంబాబుని చితకబాదారు గ్రామస్తులు.