
- ఏపీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి
ఆమనగల్లు, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నీరా ప్రాసెసింగ్ యూనిట్ ను ఏపీలో త్వరలో ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తెలిపారు. ఆదివారం ఆమె రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని నీరా ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించారు. ఈత, తాటి చెట్ల నుంచి కల్లు తీసే విధానాన్ని గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. నీరా కేఫ్ కు ఎంత టెంపరేచర్ లో సప్లై చేస్తున్నారు? నీరా నుంచి ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి? తదితర అంశాలను ఆరా తీశారు.
ఏపీలోని కర్నూల్ నుంచి తీసుకొచ్చిన నీరాను టేస్ట్ చూసి బాగుందని చెప్పారు. అనంతరం చరికొండ గ్రామాన్ని సందర్శించి గీత కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు తాను వచ్చినట్లు తెలిపారు. ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యా చౌహాన్, ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు.