![ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి వాట్సాప్ ద్వారా 161 సేవలు..](https://static.v6velugu.com/uploads/2025/01/ap-government-launches-whatsapp-governance_xbFOBuaqMo.jpg)
వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంబించింది ఏపీ సర్కార్. వాట్సాప్ గవర్నెన్స్ సేవల కోసం 9552300009 నంబర్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఈ నంబర్ ద్వారా తొలి విడత కింద 161 సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. గురువారం ( జనవరి 30, 2025 ) మంత్రి లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడం దేశంలోనే ఇది తొలిసారి. తొలివిడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు వాట్సప్లో అందుతాయి.
సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి లోకేష్. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో.. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024లో అక్టోబర్ లో మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం.
Also Read : ఏపీలో క్రిప్టో హవాలా గ్యాంగ్
సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పనిచేస్తుందని.. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్లు వంటి సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందనున్నాయి.
మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీ,ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం.