
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించి కోవాలనుకున్న ఆరుగురు భక్తుల జీవితాలు.. టోకెన్లు తీసుకునేలోపే తెల్లారిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో తిరుమల చరిత్రలో ఎన్నడూ చూడని దురదృష్టకర ఘటన ఈనెల 8వ తేదీన చోటుచేసుకుంది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఈ తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం(జనవరి 22) ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.