
అమరావతి : ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు ఏపీకి తరలిస్తున్నారు. ఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు.
రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడు. జగన్ కు విధేయుడిగా ప్రచారం ఉంది. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. జత్వానీ కేసులో ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ సిటీ మాజీ పోలీస్కమిషనర్ కాంతిరాణా టాటా, మాజీ విజయవాడ డిసిపి విశాల్ గున్నిను సస్పెండ్ చేశారు.
తనపై తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని ముంబై నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉన్నతస్థాయిలో ఉన్న ఐపిఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడ్డారో వివరించారు. నటి జెత్వానిని వేధించి అక్రమంగా అరెస్ట్ చేసిన కేసులో మొత్తం 15 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. లేటెస్ట్ గా పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది