
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్ క్లియర్ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని లక్షన్నర క్యూసెక్కులకు పెంచుకున్న పొరుగు రాష్ట్రం.. దాని కింద నిర్మించిన శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) ద్వారా పూర్తి స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు వీలుగా వారం నుంచి లైనింగ్ పనులను స్పీడప్ చేసింది. ఇప్పటివరకు లైనింగ్ లేని ఈ కెనాల్ ద్వారా కేవలం 44 వేల క్యూసెక్కులనే తరలించే వీలుండగా.. రెండు, మూడు నెలల్లో లైనింగ్ పూర్తి చేయడం ద్వారా రోజూ 90 వేల క్యూసెక్కుల (8 టీఎంసీలు) చొప్పున తన్నుకుపోయేలా కుట్ర చేస్తున్నది. ట్రిబ్యునల్లో కేసు నడుస్తున్నా, ఇరిగేషన్ అవసరాలకు నీళ్లను ఔట్ సైడ్బేసిన్కు తరలించడానికి వీల్లేదని బచావత్ట్రిబ్యునల్ అవార్డు చెబుతున్నా.. ఏపీ అవేవీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నది.
నాడు 1,500 క్యూసెక్కులకే అనుమతి..
శ్రీశైలం ప్రాజెక్టును కేవలం విద్యుదుత్పత్తి కోసమే వాడాలని 1973లో బచావత్ ట్రిబ్యునల్స్పష్టంగా చెప్పింది. హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కాబట్టి.. నీటిని ఇరిగేషన్ అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదని ఆదేశించింది. అది కూడా ఔట్సైడ్ బేసిన్లోని ఇరిగేషన్అవసరాలకు తరలించకూడదని పేర్కొంది. ఒకవేళ తరలించాల్సి వస్తే కేవలం ఇన్సైడ్ బేసిన్కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో 1977 అక్టోబర్ 28న జరిగిన అగ్రిమెంట్ప్రకారం.. చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక వాటర్ఇయర్లో 15 టీఎంసీలకు మించకుండా 1,500 క్యూసెక్కులతో కాల్వలను డిజైన్ చేయించాలని సూచించింది. కానీ, చెన్నైకి తాగునీటి ముసుగులో ఏపీ పాలకులు ఔట్సైడ్ బేసిన్ అయిన పెన్నా బేసిన్లోని రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించే కుట్రకు తెర లేపారు.
►ALSO READ | ఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ
1980లలో మొదలైన ఆ జల దోపిడీ.. ఆ తర్వాత మరింత పెరిగి, ప్రస్తుతం రోజూ 8 టీఎంసీలు తరలించే స్థాయికి చేరింది. ఏపీ పాలకులు 1980లలో 44,600 క్యూసెక్కుల కెపాసిటీతో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్, 19,150 క్యూసెక్కుల సామర్థ్యంతో శ్రీశైలం రైట్మెయిన్ కెనాల్(అన్లైన్డ్), 48,525 క్యూసెక్కుల సామర్థ్యంతో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టారు. 2005లో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 1,56,100 క్యూసెక్కులకు, ఎస్ఆర్ఎంసీ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 81,975 క్యూసెక్కులకు పెంచారు. 2020లో ఎస్ఆర్ఎంసీ కెపాసిటీని 89,762 క్యూసెక్కులకు పెంచేలా లైనింగ్పనులను చేపట్టేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏడాది మే 5న జీవో 203 ఇచ్చింది. ఇప్పుడు ఆ పనులను స్పీడప్చేస్తోంది.