
- బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే 305 జీవో
- జీబీ లింక్ పేరుతో పాత జీవో దుమ్ము దులుపుతున్న ఏపీ సర్కారు
- ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు షురూ
- పూర్తయితే లక్షన్నర క్యూసెక్కులకు ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం
- రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్
- పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్కు కూడా బనకచర్లే లింక్
- ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఆయకట్టు రెడీ అయితే ఏపీని ఆపడం కష్టమే అంటున్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ పేరుతో ఏపీ మరో కుట్రకు తెరలేపుతున్నది. పోలవరం నుంచి రోజూ 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోసుకుని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు తరలిస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సాకుతో పెన్నా బేసిన్కు ఆయువుపట్టుగా ఉన్న బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింత విస్తరించే కుట్ర పన్నుతున్నది. ఇందుకోసం 2005లో పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలోనే బనకచర్ల విస్తరణకూ ఇచ్చిన జీవో 305 దుమ్ముదులుపుతున్నది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని బనకచర్ల హెడ్రెగ్యులేటర్ కెపాసిటీని పెంచడంతోపాటు అక్కడి నుంచి ప్రారంభమయ్యే కెనాల్స్ విస్తరణ, లైనింగ్ పనులకు రెడీ అవుతున్నది. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసీ) లైనింగ్ పనులు షురూ అయ్యాయి. ఇది పూర్తయితే ఎస్ఆర్ఎంసీ కెపాసిటీ లక్షన్నర క్యూసెక్కులకు పెరుగుతుంది. దీనికి రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చే 3 టీఎంసీల కెనాల్, పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్ తోడైతే శ్రీశైలం, పోలవరం నుంచి రోజూ 18 టీఎంసీల నీటిని మళ్లించుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం 90 వేల క్యూసెక్కులే..
బనకచర్ల హెడ్ రెగ్యులేటర్తో ప్రస్తుతం 90 వేల క్యూసెక్కుల నీటినే మాత్రమే సీమవైపు తీసుకెళ్లే అవకాశం ఉంది. హెడ్రెగ్యులేటర్ కింద ఉన్న తెలుగుగంగ, కేసీ కెనాల్, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్ సిస్టమ్స్ ద్వారా రోజుకు సుమారు 8 టీఎంసీల నీటిని తరలించవచ్చు. జీబీ లింక్ ద్వారా బాబు తెస్తామంటున్న మరో 2 టీఎంసీలను రాయలసీమకు తరలించాలంటే ప్రస్తుతం ఉన్న కాల్వల ద్వారా సాధ్యం కాదు. దీనికితోడు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తిచేసుకున్న రాయలసీమ లిఫ్ట్ కోసం ప్రత్యేకంగా మరో కెనాల్తవ్వి బనకచర్లకు తేనున్నారు. దీని కెపాసిటీ 33 వేల క్యూసెక్కులు కాగా, రోజుకు 3 టీఎంసీలను తరలించవచ్చు. ఇలా ఏరకంగా చూసినా రోజుకు 20 లక్షల క్యూసెక్కులకు పైగా అంటే రోజుకు 18 టీఎంసీల నీటిని తరలించే మాస్టర్ ప్లాన్ను ఏపీ రెడీ చేస్తున్నట్టు నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు.
ఎస్ఆర్బీసీకి లైనింగ్
పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్లకు నీటిని తీసుకొచ్చే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్(ఎస్ఆర్ఎంసీ) లైనింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆ పనులు పూర్తయితే 90 వేల క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న ఈ కెనాల్సామర్థ్యం కాస్తా లక్షన్నర క్యూసెక్కులకు పెరుగుతుంది. అందుకు తగ్గట్టు బనకచర్ల రెగ్యులేటర్ ను విస్తరించడంతోపాటు దిగువన ఉన్న శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, కేసీ కెనాల్, గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్, తెలుగు గంగ కాల్వల కెపాసిటీని కూడా పెంచాలని ఏపీ భావిస్తున్నది. ఉదాహరణకు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్ బీసీ) కెపాసిటీ11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని సామర్థ్యాన్ని పెంచాలని సీమ నేతల నుంచి చాలా ఏండ్లుగా డిమాండ్లు ఉన్నాయి. దీంతో ఎస్ఆర్బీసీ లైనింగ్పనులు చేపట్టనున్నట్టు 2015లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నాడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు జీబీ లింక్ను ముంగటేసుకున్న ఏపీ సర్కార్.. ఎస్ఆర్బీసీ లైనింగ్కు సంబంధించి పాత ఫైలు దుమ్ము దులుపుతున్నది. ఈ లైనింగ్ పనులు పూర్తయితే కాల్వ కెపాసిటీ 22 వేల క్యూసెక్కులకు పెరుగుతుంది. అంటే ఎస్ఆర్బీసీ ద్వారా ప్రస్తుతం రోజుకు ఒక టీఎంసీ తీసుకెళ్తుండగా, ఇకపై 2 టీఎంసీలు తీసుకెళ్తారన్నమాట! ఇలాగే మిగిలిన 3 కాల్వల విస్తీర్ణం పెంచడంతోపాటు లైనింగ్ పనులు పూర్తిచేసి ప్రతిరోజూ 18 టీఎంసీల వాటర్ను తరలించే కెనాల్ సిస్టమ్ను ఏపీ సర్కారు రాబోయే రోజుల్లో సిద్ధం చేసి పెట్టుకోబోతున్నది. ప్రస్తుతం దొంగతనంగా ఈ నీటిని ఎత్తుకెళ్తున్న ఏపీ, ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ, ఆయకట్టు రెడీ చేసిపెట్టుకున్నాక ఆ నీళ్లన్నీ తన హక్కుగా రావాల్సినవని ట్రిబ్యునల్స్లో కొట్లాడే అవకాశం ఉంటుందని తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పరిస్థితి అంత దూరం రాకముందే ఏపీ సర్కారు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.
శ్రీశైలంలోని నిల్వ నీళ్లన్నీ మనకే ఉండేలా!
వాస్తవానికి శ్రీశైలం స్పిల్ వే దూకుతున్న టైమ్లో తాము నీళ్లు వాడుకుంటే ఇబ్బంది ఏముంటుందని ఏపీ వాదిస్తున్నది. మరి అదే సమయంలో తెలంగాణ నీటి ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తున్నది. ఏపీ మిగులు జలాలను వాడుకుంటే.. వరదలు తగ్గాక శ్రీశైలం లో నిల్వ ఉండే జలాలను మొత్తం మనమే వాడుకునేలా ప్రతిపాదన ముందు పెట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తున్నది. లైవ్ స్టోరేజ్లోని 165 టీఎంసీల నీరు మనకే దక్కేలా ట్రిబ్యునల్లో పోరాడాలని ఆలోచన చేస్తున్నది. ఇదే డిమాండ్ను ఏపీతో పాటు సీడబ్ల్యూసీ, కృష్ణా ట్రిబ్యునల్ముందు పెట్టాలని ఇరిగేషన్ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అప్పుడే ఏపీ చేస్తున్న వితండవాదానికి అడ్డుకట్ట పడ్తుందని, తెలంగాణ తన వాటా జలాలను వినియోగించుకునే అవకాశమూ ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.