
- విద్యార్థుల అపార్ నమోదులో తలెత్తుతున్న సమస్యలు
- స్కూల్, కాలేజీ రికార్డుల్లో తేడాలు, ఆధార్లో తప్పులుంటే రిజెక్ట్
- బర్త్ సర్టిఫికెట్, ఫోన్ నంబర్ అప్డేట్ వంటి చిన్నిచిన్న సమస్యలతో సతమతం
- ప్రీ–ప్రైమరీ నుంచి ఉన్నత చదువులు, ఆక్టివిటీస్వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు
కామారెడ్డి , వెలుగు ‘ఒక దేశం, ఒక స్టూడెంట్ ఐడీ కార్డు’ పేరుతో కేంద్ర ప్రభుత్వం అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్రిజిస్ట్రీ)ని తీసుకొచ్చింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య, విద్యార్థుల ఆక్టివిటీస్వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి దేశ పౌరులకు ఆధార్కార్డులా విద్యార్థులకు ఒక నంబర్తో అపార్ ఐడీ కార్డులను ఇవ్వనున్నారు.
ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నత చదువులు కంప్లీట్ అయ్యే వరకు ఈ నంబర్ ఉంటుంది. క్లాసుల వారీగా వచ్చిన మార్కులు, ఉత్తీర్ణత వివరాలు, స్పోర్ట్స్, ఇతరత్రా యాక్టివిటీ, వారికి వచ్చిన అవార్డుల వంటి వివరాలన్నీ ఉంటాయి. విద్యా సంస్థల్లో అపార్ ఎంట్రీ పక్రియ గత 3 నెలలుగా జరుగుతోంది. అయితే చిన్నచిన్న సమస్యలు తలెత్తుతుండడం వల్ల కామారెడ్డి జిల్లాలో అపార్ ఎంట్రీ 61.62 శాతమే పూర్తైంది.
టెక్నికల్గా ఇబ్బందులు..
అపార్లో స్టూడెంట్స్ వివరాలు ఎంట్రీ చేసేటప్పుడు పూర్తి సమాచారం ఉండాలి. స్కూల్, కాలేజీ అడ్మిషన్ రికార్డుల్లో తేడాలు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్లో విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాలు, గ్రామం వివరాలు, ఫోన్ నంబర్ అప్డేట్ వంటి కరెక్షన్స్ ఉంటే అపార్లో వివరాలు నమోదు కావడం లేదు.
ప్రైమరీ, హైస్కూల్, కాలేజీల్లో ఉండే అడ్మిషన్ రికార్డులు ఒకేలా ఉండాలి. లేకపోతే అపార్ ఎంట్రీ కావట్లేదు. వీటన్నింటి సవరణకు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి. ప్రస్తుతం ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా, ఎండకాలం సెలవులు కూడా వస్తున్నాయి. హాలిడేస్ తర్వాతే టార్గెట్ కంప్లీట్
అయ్యే వీలుంది.
జిల్లాలో పరిస్థితి..
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు జిల్లాలో 1,71,542 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 1,05,699 మంది స్టూడెంట్స్కు అపార్ జనరేట్ అయ్యింది. ఎంట్రీ చేసిన దాంట్లో 873 మంది స్టూడెంట్ప్ వివరాలు ఆన్లైన్లో ఫెయిల్ అయ్యాయి. రికార్డుల తేడాతో ఆన్లైన్ కంప్లీట్ కాలేదు. ఇంకా 64,956 మంది స్టూడెంట్స్ వివరాలు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ 1013, ప్రైవేట్ స్కూల్స్ 168, గవర్నమెంట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 42 ఉన్నాయి. కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్, మాడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నింటిలో చదువుతున్న స్టూడెంట్స్ వివరాలను అపార్ చేయించడాన్ని జిల్లా విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది.
గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఎంట్రీ చేస్తున్నారు. 1,71,542 మందికి గాను ఇప్పటి వరకు 1,05,6 99 ( 61.62 శాతం) మంది వివరాలు అపార్కు యాడ్ అయ్యాయి. ఇంకా 64,956 మంది ( 38. 39 శాతం) వివరాలు ఎంట్రీ కావాల్సి ఉంది. 873 మంది వివరాలను అపార్ రిజెక్టు చేసింది. ఆధార్ అప్డేట్స్ చేయడానికి త్వరలో ఒక్కో మండలంలో కొన్ని స్కూల్స్ సెలెక్టు చేసి ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసే అవకాశముంది. అపార్ కంప్లీట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కోఆర్డినేటర్ రమణరావు పేర్కొన్నారు.