
న్యూఢిల్లీ : హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ అమ్మకం కోసం పిరమల్ గ్రూప్, అదానీ గ్రూప్, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మీల్) వంటి కంపెనీల నుంచి ప్రభుత్వం త్వరలో ఫైనాన్షియల్ బిడ్లను తీసుకుంటుందని సంబంధిత ఆఫీసర్లు చెప్పారు. ఇందుకోసం పరిశీలన (డ్యూ డిలిజెన్స్) జరుగుతోందని, ఫైనాన్షియల్ బిడ్ల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తామని అన్నారు. కంపెనీలు ఇది వరకే తమ ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’(ఈఓఐ)లను అందజేశాయి. ప్రభుత్వం 2021 డిసెంబర్లో హెచ్ఎల్ఎల్ వాటాల అమ్మకం పనులను ప్రారంభించింది. ఈఓఐలను సమర్పించడానికి మార్చి 14 వరకు అనుమతించింది. తిరువనంతపురం కేంద్రంగా పనిచేసే హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) మూడ్స్ కండోమ్లు, హ్యాపీ డేస్ శానిటరీ ప్యాడ్లను తయారు చేస్తుంది. రీ-హైడ్రేషన్ సాల్ట్, రక్తమార్పిడి పరికరాలు, గాయాల మందులు, బ్లడ్ బ్యాంకింగ్ పరికరాలు, నియో-నాటల్ కేర్ పరికరాలు, సర్జికల్ హెల్త్కేర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. ప్రభుత్వం ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా పీడబ్ల్యూసీని నియమించింది.