
హైదరాబాద్, వెలుగు: పర్మిషన్ లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం, అనధికారికంగా మంజీరా నీటి వినియోగంపై తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మెదక్ డీపీవో, శివంపేట్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. శివంపేట్ పరిధిలో స్కోల్ బ్రూవరీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మంజీర నుంచి అనధికారికంగా నీటిని వినియోగించుకుంటున్నదని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శివంపేట్కు చెందిన కె.మల్లిఖార్జున గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సంస్థ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా.. ఆఫీసర్లు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి తో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. డీపీవో, పీఎస్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.