
- ఎమ్మెల్యేలు సుమన్, దివాకర్రావు, చిన్నయ్యతోనూ మంత్రి చర్చలు
- అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని ఆదేశం
- తనకే టికెట్ ఇవ్వాలన్న అరవింద్రెడ్డి
- పిలుపు వచ్చినా వెళ్లని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ఎమ్మెల్యేలకే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆశలు పెట్టుకున్న పలువురు లీడర్లు అసమ్మతి రాగం అందుకున్నారు. దీంతో అలర్టైన పార్టీ హైకమాండ్ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ అసంతృప్తులకు బుజ్జగింపులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలతో మంత్రి సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ శనివారం సెక్రటేరియట్లో కేటీఆర్తో భేటీ అయ్యారు.
వారి వెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య కూడా ఉన్నారు. అరవింద్రెడ్డి, సతీశ్కుమార్తో వేర్వేరుగా భేటీ అయిన కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. సర్వేల ఆధారంగానే సీఎం కేసీఆర్ సిట్టింగ్ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసినట్లు స్పష్టం చేసిన ఆయన.. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని నచ్చజెప్పినట్టు సమాచారం.
రాజీ కుదిరిందా..?
మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ఈసారి మంచిర్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ఆశించారు. సతీశ్మూడు నెలల కిందటే కార్యాచరణ మొదలు పెట్టగా, అరవింద్రెడ్డి టికెట్తనకే వస్తుందనే ధీమాతో ఎదురుచూశారు. కానీ సిట్టింగ్ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుకు టికెట్ ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో వీరిద్దరు అసమ్మగతి గళం వినిపించారు. సర్వేల్లో తానే ముందున్నప్పటికీ కేసీఆర్పట్టించుకోలేదని, దివాకర్రావును ఓడిస్తానని ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అరవింద్రెడ్డి బహిరంగంగానే అన్నారు.
పురాణం సతీశ్ సొంత నియోజకవర్గం చెన్నూర్ ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఆయన కూడా మంచిర్యాల నుంచే బరిలో దిగాలని భావించారు. నియోజకవర్గంలోని ఉద్యమకారులు, సింగరేణి కార్మికులు, పార్టీలీడర్ల మద్దతు కోరుతూ విస్తృతంగా పర్యటించారు. కానీ ఆయన స్పీడ్కు సీఎం కేసీఆర్ ఆదిలోనే బ్రేకులు వేయడంతో సైలెంట్అయ్యారు. తనను రాజకీయంగా అణగదొక్కిన బాల్క సుమన్ను చెన్నూర్లో ఓడించడమే లక్ష్యంగా ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరంతా మంత్రి కేటీఆర్ను కలవడం విశేషం. కేటీఆర్సమక్షంలో ఎమ్మెల్యేలకు, అసంతృప్తి నేతలకు మధ్య రాజీ కుదిరిందేమోనన్న చర్చ మొదలైంది.
టికెట్ నాకే ఇయ్యాలని అడిగిన: అరవింద్
ఈ భేటీ విషయంపై అరవింద్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. మంచిర్యాల టికెట్ తనకే ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు తెలిపారు. సిట్టింగ్ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని కేటీఆర్కు వివరించానని చెప్పారు. ఒకవేళ తనకు టికెట్రాకుంటే బీసీలకు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశానన్నారు. హైకమాండ్ నుంచి త్వరలోనే సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నానని, లేదంటే తన కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.
నల్లాల మదిలో ఏముందో..?
చెన్నూర్మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు సైతం మంత్రి కేసీఆర్నుంచి పిలుపు వచ్చినప్పటికీ వెళ్లలేదు. స్థానికంగా మ్యారేజీలకు అటెండ్కావాల్సి ఉందని, రెండు మూడు రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పినట్టు ఓదెలు తెలిపారు. గత ఎన్నికల్లో ఓదెలు సిట్టింగ్ సీటును గుంజుకున్న బాల్క సుమన్మరోసారి చెన్నూర్టికెట్దక్కించుకొని ఇక్కడే పాగా వేశారు. దీంతో నల్లాల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారు. అక్కడ ఇముడలేక రెండు నెలలకే సొంత గూటికి తిరిగొచ్చారు. మళ్లీ ఆయన కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓసారి కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన ‘ప్యాకేజీ’ కోసమే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారని ఆరోపణలు రావడం వల్ల ఓదెలు విశ్వసనీయత సన్నగిల్లుతోంది.