
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల విషయంలో ఏపీ దోపిడీ ఆగడం లేదు. సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాలని నెల కింద జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్లో నిర్ణయం జరిగినప్పటికీ, ఆ రాష్ట్రం మాత్రం అది పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సాగర్కుడి కాల్వ నుంచి రోజుకు 6 వేల నుంచి 8 వేల క్యూసెక్కుల నీళ్లను తరలించుకుపోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 13 టీఎంసీల దాకా అడ్డదారిలో ఎత్తుకెళ్లింది. ఈ నెల 13 నుంచే ఏపీ తాము తీసుకునే నీళ్లను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాల్సి ఉన్నా, ఆ రాష్ట్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సగటున రోజూ 7 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నది. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27 నాటికి వాడుకోవాల్సిన నీళ్లు ఏపీకి కేవలం 27 టీఎంసీలే ఉండగా.. అందులో దాదాపు సగం ఇప్పటికే వాడేసుకున్నది. మరోవైపు సాగర్ టెయిల్పాండ్ నుంచి కూడా 4 టీఎంసీలను తరలించుకుపోయింది.
అట్లయితే మనకు నీళ్లు కష్టమే..
సాగర్లో నీటి మట్టం 510 అడుగల దిగువకు వెళ్తే.. మనం నీటిని తీసుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దానికి తోడు కరెంట్సరఫరా కోసం ఓ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకుంటే గానీ పని జరగదంటున్నారు. అంతేగాకుండా 510 అడుగుల దిగువకు వెళ్లాక అక్కడి వరకు వెళ్లేందుకు సరైన బాట కూడా ఉండదని, యాక్సెస్తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి చోటుకు మోటార్లను తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నా కష్టమవుతుందని అంటున్నారు. పైగా వాటికి మనమే మళ్లీ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏపీ మాత్రం ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఖర్చు లేకుండా వట్టి పుణ్యానికి నీళ్లు తీసుకెళ్తే.. తాము మాత్రం అన్ని కష్టాలు పడుతూ, ఖర్చు పెట్టుకుంటూ నీటిని ఎందుకు తీసుకెళ్లాలన్న ప్రశ్నలను అధికారులు లేవనెత్తుతున్నారు.