- వచ్చే క్వార్టర్లో ప్రొడక్షన్ మొదలవుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: చైనాలో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంట్ వచ్చే క్వార్టర్లో ప్రారంభమవుతుందని అరబిందో ఫార్మా ప్రకటించింది. 2025–26 లో పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతానం సుబ్రమణియన్ అన్నారు. ఈ హైదరాబాద్ కంపెనీ చైనా ఫ్యాక్టరీని నవంబర్–డిసెంబర్ టైమ్లో ప్రారంభించి, వచ్చే ఏడాది మార్చి క్వార్టర్లో తయారీ కెపాసిటీ పెంచాలని చూస్తోంది. యూఎస్, చైనాలో కొత్త మందులను అమ్మడానికి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని, చైనా మార్కెట్ నుంచి మరికొన్నేళ్లలో రెవెన్యూ పుంజుకుంటుందని సుబ్రమణియన్ చెప్పారు.
ఈ ఏడాది మాత్రం సేల్స్, వాల్యూ తక్కువగా ఉంటుందన్నారు. ఆంధ్రాలోని పెన్–జీ (పెన్సిలిన్) ప్లాంట్లో ప్రొడక్షన్ ఈ ఏడాది అక్టోబర్ నుంచి పుంజుకుంటుందని వివరించారు. అరబిందో ఫార్మా రూ.2,400 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో పెన్–జీ ప్లాంట్ను నిర్మించింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) కింద అర్హత పొందింది.
ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి 15 వేల టన్నులు. యూఎస్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగుతాయని సుబ్రమణియన్ అన్నారు. యూరప్ మార్కెట్లో గ్రోత్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇబిటా 21–22 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అరబిందో ఫార్మాకు ఈ ఏడాది జూన్ క్వార్టర్లో రూ.919 కోట్ల నికర లాభం వచ్చింది.