
ఆర్మూర్, వెలుగు: వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు సిబ్బందికి సూచించారు. బుధవారం ఆర్మూర్మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండి బకాయిల వసూలుకు కఠినంగా వ్యవహరించాలన్నారు. వీలైతే నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ తొలగించాలని, లేదంటే ఇంటిని సీజ్ చేసైనా టాక్స్ వసూలు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 4125 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఇందులో 3065 మందికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపించామని తెలిపారు. ఇందులో 201 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారని, వారికి 25 శాతం రాయితీ కింద లబ్ధి చేకూరిందని తెలిపారు. సమావేశంలో ఆర్వో ఉమాదేవి ఆర్ఐ దత్త రెడ్డి, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.