గణేశ్​ నిమజ్జనానికి అంతా రెడీ

గణేశ్​ నిమజ్జనానికి అంతా రెడీ
  • జిల్లాలో 5,700 మండపాలు
  • మంగళవారం 11 గంటలకు శోభాయాత్ర షురూ
  • 8 ఫీట్లకంటే ఎత్తున్న విగ్రహాల మళ్లింపు
  • నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్​లు, సీసీ కెమెరాలు, గజ ఈతగాళ్లు 
  • 2 వేల మంది పోలీసులతో బందోబస్తు
  • సమస్యాత్మక ఏరియాలపై ఇంటెలిజెన్స్​నిఘా
  • రౌడీ షీటర్ల కదలికలపై ఫోకస్​

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సార్వజనిక్​ గణేశ్​నిమజ్జనం, శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత యాడాది కంటే ఈసారి పది శాతం వినాయక మండపాలు పెరిగాయి. మొత్తం 5700 ‌‌విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు పర్మిషన్​ ఇవ్వగా, తొమ్మిది రోజులు పూర్తయ్యే నాటికి  వెయ్యి విగ్రహాల నిమజ్జనం ముగిసింది.  11 రోజుల పాటు  భక్తుల పూజలందుకున్న 4700​ గణేశ్​ విగ్రహాల నిమజ్జనం మంగళవారం జరగనుంది.   గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని  నిమజ్జం కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. 

ట్రాఫిక్​ డైవర్షన్..బాసర​ బ్రిడ్జి క్లోజ్​​

నిజామాబాద్​ నగరంలోని దుబ్బ ఏరియా నుంచి సార్వజనిక్​ గణేశ్​మండలి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.  ఇందుకోసం రథాన్ని ముస్తాబు చేశారు. రథాన్ని లాగడానికి 15 జతల ఎడ్లను సిద్ధం చేశారు.  బోధన్​ సబ్​డివిజన్​లో 1,079 ఆర్మూర్​ సబ్​ డివిజన్​లో 470 వినాయక విగ్రహాల నిమజ్జన యాత్ర అప్పుడే షురూ అవుతుంది. చిన్న సైజు విగ్రహాలను నగరంలోని వినాయక్​నగర్​ బావిలో నిమజ్జనం చేస్తారు. బోధన్​లో పసుపు వాగు, శక్కర్​నగర్​లో గణేశ్​​ బావి, ఆర్మూర్​లో గూండ్ల చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. అధిక శాతం ఆరు ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలు ప్రతిష్ఠించినందున వాటిని గోదావరిలో నిమజ్జనం చేస్తారు.

జిల్లాలో 4,700 విగ్రహాలకు అదనంగా హైదరాబాద్​, జగిత్యాల  నుంచి విగ్రహాలు వస్తాయని పోలీసులు అంచనా వేశారు. ట్రాఫిక్​ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నాలుగు రూట్​లలో ఆంక్షలు విధించారు. రాజధాని నుంచి వచ్చే వాహనాలు సిటీలోకి ఎంటర్​ కాకుండా బైపాస్  నుంచి మళ్లిస్తున్నారు.  వర్ని  చౌరస్తా మీదుగా బాన్స్​వాడ వెహికల్స్, బోధన్​ వెళ్లే వాహనాలు న్యూకలెక్టరేట్​ రోడ్​మీదుగా హైదరాబాద్​ నుంచి వచ్చే ఆర్టీసీ బస్​లను ఎన్టీఆర్​ చౌరస్తా మీదుగా డైవర్ట్​ చేశారు. రెండు రోజుల పాటు బాసర బ్రిడ్జిపై పబ్లిక్​ ట్రాన్స్​పోర్టును కందకుర్తి వైపు మళ్లించారు. 

విగ్రహాల మళ్లింపు కూడా

నిజామాబాద్​ పక్కనున్న జాన్కంపేట రైల్వేలైన్​పై  హైటెన్షన్​ కరెంట్​ లైన్​ఉంది. ఎనిమిది ఫీట్లకంటే ఎత్తున్న విగ్రహాలు రైల్వేట్రాక్​ దాటడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో నందిపేట ఉమ్మెడ వద్ద గోదావరికి వాటిని మళ్లించనున్నారు. బోధన్​ మీదుగా వెళ్లే విగ్రహాలు సాటాపూర్​ మీదుగా కందకుర్తికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా రెండురోజులు మద్యం దుకాణాలు క్లోజ్​ చేయించారు.

అడుగడుగునా నిఘా

జోన్​-1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి పర్యవేక్షణలో సీపీ కల్మేశ్వర్, ముగ్గురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలతో పాటు సీఐ, ఎస్ఐ లతో కలిపి మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించారు. భక్తులతో  కలిసిపోయేలా మఫ్టీ పోలీసులు, మహిళా పోలీసులకు డ్యూటీలు వేశారు. శోభాయాత్ర మొదలుకొని నిమజ్జనం ముగిసే దారిలో వందలాది సీసీ కెమెరాలు బిగించి వాటిని జిల్లా కేంద్రంలోని కమాండ్​ కంట్రోల్​ రూం ద్వారా పర్యవేక్షించనున్నారు.

గోదావరిలో నిమజ్జన పాయింట్ల వద్ద ఫ్లడ్​ లైట్లు, క్రేన్​లు, గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. డీజే కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.  పోలీసు ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ ఇప్పటికే స్పష్టం చేశారు. 70 దాకా ఉన్న సెన్సిటివ్​ ఏరియాలపై మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్​ పోలీసులు ప్రతీఒక్కరిపై  నిఘా పెట్టాయి. మతపరమైన అల్లర్లకు పాల్పడి రౌడీషీటర్లుగా నమోదైన వారిని బైండోవర్​ చేశారు.