![పంజాబ్లో సీఎంను మారుస్తారా.. ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ](https://static.v6velugu.com/uploads/2025/02/arvind-kejriwal-meets-punjab-cm-mann-mlas-after-aaps-delhi-defeat-amid-speculation-of-exodus_wKDuYmlBy8.jpg)
- సీఎంను మార్చేస్తారంటూ రాజకీయవర్గాల్లో ఊహాగానాలు
న్యూఢిల్లీ: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాష్ట్ర యూనిట్లో అసమ్మతి నెలకొందని, అక్కడ ప్రభుత్వ మార్పు జరగవచ్చంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను, మంత్రులను, పార్టీ ఎమ్మెల్యేలను ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి పిలిపించారు.
మంగళవారం వారితో కపుర్తలా హౌస్లో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.."ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్ కు చెందిన ఆప్ నేతలు పార్టీ కోసం చాలా పనిచేశారు.
వారందరికి అర్వింద్ కేజ్రీవాల్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ నేతలపై ఢిల్లీ ప్రజలకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా భవిష్యత్తులోనూ పనిచేస్తాం.
పంజాబ్లోని ఆప్ యూనిట్లో అసమ్మతి ఉన్నదనేది పూర్తిగా అబద్ధం. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారు. ఎవరూ ఏ పార్టీతో టచ్ లో లేరు. కాంగ్రెస్ నాయకులకే పార్టీలు మారే చరిత్ర ఉంది. ఆప్ నాయకులు పార్టీ పట్ల పూర్తి అంకితభావంతో ఉన్నారు" అని భగవంత్ మాన్ వెల్లడించారు.
పంజాబ్లోని 20 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన కామెంట్ పై కూడా సీఎం స్పందించారు. "ప్రతాప్ బజ్వా దాదాపు మూడేండ్లుగా ఇదే చెబుతున్నారు. ఆయన ఆప్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే బదులు ఢిల్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కించడం బెటర్. ఢిల్లీలో సున్నా సీట్లు సాధించడంలో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధించింది" అని ఎద్దేవా చేశారు.
త్వరలో మహిళలకు రూ.1,000
తమ రాష్ట్రంలో కూడా ఢిల్లీ నమూనాను అమలు చేస్తున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్ల మాదిరిగానే ఆమ్ ఆద్మీ క్లినిక్లు నిర్మిస్తున్నామన్నారు. పంజాబ్ గతంలో దేశ అభివృద్ధికి దోహదపడిందని..భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళలకు రూ. 1,000 ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం
మాత్రమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.