
- ఇంటింటి ప్రచారం షురూ
- కుల సంఘాలతో మీటింగ్ లు, మద్దతు కోసం మంతనాలు
మెదక్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తల మీటింగ్లు నిర్వహించాయి. అభ్యర్థులు ఖరారయ్యాక మండల స్థాయి మీటింగ్లు పెట్టారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలయ్యాక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు, అగ్రనేతల బహిరంగ సభలు జరిగాయి.
ఆయా వేదికల ద్వారా తమ పార్టీ విధానాలు తెలియజెప్పడంతోపాటు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో మూడు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ స్థానిక నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు, అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఇంటింటికీ తిరిగి పార్టీ గుర్తులు పంచుతూ ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. పట్టణాల్లో షాప్ టు షాప్ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
ప్రచార గడువు ముగిసే వరకు ప్రతీ గ్రామంలో ప్రతీ వార్డులో, ప్రతీ పట్టణంలో ఇంటింటికి వెళ్లి పార్టీ గుర్తులున్న కరపత్రాలు పంచి ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. అలాగే మరోవైపు వివిధ సామాజిక వర్గాలు, కుల సంఘాలు, వృత్తి, వ్యాపార సంఘాలతో మీటింగ్లు నిర్వహిస్తూ వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్నిచోట్ల ఆయా సంఘాల వారికి సంఘ భవనాలకు, ఆలయాల నిర్మాణానికి ఆర్థిక చేయూత అందిస్తుండగా, మరికొన్నిచోట్ల వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇంకోవైపు పోల్ మేనేజ్ మెంట్పై దృష్టి పెట్టారు. బూత్ కమిటీ ఇన్చార్జిలను యాక్టివ్ చేస్తూ ఆయా బూత్ల పరిధిలో ఉన్నఓటర్లందరినీ పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటేయించే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఆయా బూత్లలో లభించిన ఓట్లను పరిగణలోకి తీసుకుని లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు పోలయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు.