ఆదిలాబాద్​ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన

ఆదిలాబాద్​ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన
  • ఎంప్లాయీస్​ను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డగింత
  • పోలీసులు, ఆశాల మధ్య తోపులాట, వాగ్వాదం

ఆసిఫాబాద్, వెలుగు: ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆసిఫాబాద్​ కలెక్టరేట్​ను ముట్టడించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఉదయమే జిల్లా నలుమూలల నుంచి ఆశా వర్కర్లు భారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని, మెయిన్ గేట్ తో పాటు వెనుక గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

కలెక్టరేట్ ఎంప్లాయీస్ ను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఏఎస్పీ చిత్తరంజన్ అధ్వర్యంలో పోలీసులు భారీగా కలెక్టరేట్​కు చేరుకున్నారు. అధికారులను లోపలికి పంపే ప్రయత్నంలో అక్కడున్న మహిళా పోలీసులు, ఆశా వర్కర్ల మధ్య కొద్దిసేపు తోపులాట, వాగ్వాదం  జరిగింది. పట్టువీడకుండా ఎర్రటి ఎండలో ఆరు గంటల పాటు నేలపై బైటాయించి నిరసన తెలిపారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హమీ ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బైఠాయించారు. దీంతో సీఐటీయూ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమస్యలు పరిష్కరించేవరకు పోరాడతాం

ఆదిలాబాద్​ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించేంతవరకు వారికి మద్దతుగా పోరాటాలు చేస్తూనే ఉంటామని సీఐటీయూ ఆదిలాబాద్​జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్​అన్నారు. ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్​ ముందు ధర్నా చేపట్టారు.

తమకు ఫిక్స్డ్ వేతనంతో పాటు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్​చేశారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్​సమావేశాల్లోనే తమ సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు.