
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, భూ సమస్యల పరిష్కారంపై ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంలోని అంశాలు, హక్కులపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్దావర్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పిం చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం లోని అంశాలు, హక్కులపై ప్రతి అధికారికి ఖచ్చితమైన అవగాహన ఉండాలన్నారు.
ఏదైనా పట్టా మార్పిడిపై ధరణి పోర్టల్లో అప్పీల్ చేసుకునే అవకాశం లేదని, కానీ భూ భారతి చట్టంలో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తహసీల్దార్లకు అప్పీల్ చేసుకుని, అధికారి ఇచ్చిన జడ్జిమెంట్పై కలెక్టర్కు, సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రతి పట్టా మార్పిడికి సర్వేయర్లు మ్యాప్ జత చేయాల్సి ఉంటుందని, ఈ అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.