
- గ్రామపంచాయతీ కారోబార్ సూసైడ్
- అట్రాసిటీ కేసు విషయంలో ఎస్సై వేధింపులే కారణమని సూసైడ్ నోట్
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఘటన
ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ పంచాయతీ కార్యదర్శి గుండ్ల ప్రకాశ్ (53) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్రాసిటీ కేసు విషయంలో ఎస్సై వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. వివరాల్లోకి వెళ్తే... గంగాపూర్ గ్రామానికి చెందిన ప్రకాశ్ అదే గ్రామంలోని అజ్మీరా సోని అలియాస్ గుర్లే సోని వద్ద రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. తన అప్పు తీర్చాలని ఈ మధ్య ఆమె ప్రకాశ్పై ఒత్తిడి పెంచడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అప్పు విషయంలో రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్తో పాటు మరికొందరు నాయకులు తనను వేధిస్తున్నారని, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని ఎస్సై బెదిరిస్తున్నాడని సూసైడ్ రాసి గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి ఎస్సైతో పాటు పందిర్ల మధునయ్య, మడిపెల్లి లక్ష్మీనారాయణ గౌడ్, యాదగిరి తిరుపతి, అనిశెట్టి వెంకన్న కారణమని, కొందరికి జిల్లా స్థాయి లీడర్ల అండ ఉందని నోట్లో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.