
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు సోమవారం బంద్ పాటించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్లో కాకుండా పట్టణంలోని వివేకానంద, గాంధీ చౌక్లో కూరగాయల వ్యాపారాన్ని కొంత మంది ప్రోత్సాహించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా అమ్మకాలు నిలిపివేశారు. జిల్లా ఆవిర్భావం తర్వాత వివేకానంద చౌక్ లో పెరిగిన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ. 3 కోట్లతో జూబ్లీ మార్కెట్ నిర్మించారని, కానీ కొందరి ప్రోత్సాహంతో మార్కెట్ను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మంగళవారం కూడా బంద్ పాటిస్తామని వ్యాపారులు తెలిపారు. జూబ్లీ మార్కెట్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో లోకేశ్వర్ రావు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.