- వివరణ కోరిన అసెంబ్లీ సెక్రటరీ
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జారీ!?
- జవాబు ఇచ్చేందుకు గడువు కోరిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సోమవారం నోటీసులు జారీ చేశారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్(ఖైరతాబాద్) కడియ శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు(భద్రాచలం), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి( గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ( శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి( పటాన్ చెరు), కాలె యాదయ్య(చేవెళ్ల), సంజయకుమార్( జగిత్యాల) నోటీసులు అందుకున్నారు. వీరంతా సమాధానం ఇచ్చేందుకు గడువు కోరినట్లు తెలుస్తోంది.
10న సుప్రీంలో విచారణ:
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై గత నెల 29న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏడుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీనుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన సమయం అంటే ఎంత..? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఇంత వరకూ కనీసం నోటీసులు కూడా జారీ చేయలేని కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు కు తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న సర్వోన్నత న్యాయస్థానం పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లను కలిపి ఈ నెల 10న విచారణ చేస్తామని పేర్కొంటూ వాయిదా వేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యాన్ని సతరించుకుంది.