పార్టీ ఫిరాయింపు ఇష్యూలో కీలక పరిణామం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

పార్టీ ఫిరాయింపు ఇష్యూలో కీలక పరిణామం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‎లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి 2025, ఫిబ్రవరి 4న నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ.. పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. 

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ.. మంగళవారం (ఫిబ్రవరి 4) ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.