
రాజ్యాంగంలోని ఎనిమిదో భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన, అధికార విధుల ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 242 (కూర్గు ప్రాంతం) కూడా ఎనిమిదో భాగంలోనే ఉండేది. కానీ, దానిని తొలగించారు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
కేంద్రపాలిత ప్రాంతాల పాలన
ఆర్టికల్ 239(1): ప్రతి కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. వీరు రాష్ట్రపతి ఆదేశాల మేరకు పనిచేస్తారు.
ఆర్టికల్ 239(2): కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పక్క రాష్ట్రానికి చెందిన గవర్నర్ను కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్గా నియమించవచ్చు.
యూటీల పాలకులుప్రస్తుతం దేశంలోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదు ప్రాంతాలకు (ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లఢఖ్) లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండగా, మూడు ప్రాంతాలకు (చండీగఢ్, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి) అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వీరికి ఈ హోదాను భారత రాష్ట్రపతి కల్పిస్తారు. జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2016కు ముందు వీరి జీతం 80,000, భత్యాలు ఉండేవి. కానీ, కేంద్ర క్యాబినెట్ 2016, జనవరి 1 నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ జీతాన్ని 2,25,000(అలవెన్స్)కి పెంచింది.
శాసనసభ(ఆర్టికల్ 239ఏ): మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడింటికి శాసనసభలు, మంత్రిమండళ్లు ఉన్నాయి. అవి.. 1. పుదుచ్చేరి. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి 1963లో ఏర్పాటు చేశారు.
2. ఢిల్లీ శాసనసభను 1992లో ఏర్పాటు చేశారు.
3. జమ్ముకశ్మీర్ – దీని శాసనసభను 1957లో ఏర్పాటు చేశారు.
కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనాలను పార్లమెంట్ రూపొందిస్తుంది. అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు (3) రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై పరిమితులతో కూడిన చట్టాలను రూపొందించవచ్చు.
ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం: 239బి(1) ప్రకారం పుదుచ్చేరికి కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు దేని గురించైనా తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని అడ్మినిస్ట్రేటర్ భావిస్తే అప్పుడతను ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అయితే, రాష్ట్రపతి అనుమతి లేనిదే అలాంటి ఆర్డినెన్స్ జారీ చేయకూడదు. కానీ, పుదుచ్చేరి శాసనసభ రద్దయినప్పుడు గాని లేదా శాసనసభ కార్యకలాపాలను సస్పెండ్ అయినప్పుడు గాని అడ్మినిస్ట్రేటర్ ఎలాంటి ఆర్డినెన్సులను జారీ చేయరాదు
ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి: ప్రకరణ 239ఏఏ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలియజేస్తుంది. 239ఏఏ(1) ప్రకారం 69వ రాజ్యాంగ సవరణ (1991) అమలులోనికి వచ్చినప్పటి నుంచి ఢిల్లీని ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్నారు. ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 239ఏఏ, 239ఏబీలను చేర్చారు. ఇది1992, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ కార్యనిర్వాహక అధికారిని లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. ఇతనిని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు. ఆర్టికల్ 324, 325, 326, 327, 329లు ఢిల్లీకి వర్తిస్తాయి.
- 239ఏఏ(2)(ఎ) ప్రకారం ఢిల్లీకి ఒక శాసనసభ ఉంటుంది. శాసనసభ్యుల సంఖ్య 70. శాసనసభ సభ్యులంతా ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నికవుతారు.
- 239ఏఏ(4) ప్రకారం శాసనసభ్యుల సంఖ్యలో 10 శాతం మించకుండా మంత్రి మండలిని ఏర్పాటు చేయాలి. అంటే ముఖ్యమంత్రి, ఆరుగురు మంత్రులు ఉండాలి. మంత్రులందరూ వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించగా, సంయుక్తంగా విధానసభకు బాధ్యత వహిస్తారు.
- మంత్రిమండలికి ముఖ్యమంత్రి నాయకుడు. శాసనసభ పరిధిలోని అంశాలపై లెఫ్టినెంట్ గవర్నర్కు సలహాలు ఇవ్వడం ఇతని బాధ్యత.
- ఏదైనా అంశంపై మంత్రిమండలికి, లెఫ్టినెంట్ గవర్నర్కు అభిప్రాయ భేదం వస్తే గవర్నర్ ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి ఆయన ఆదేశం మేరకు నడుచుకోవాలసి ఉంటుంది.
- రాష్ట్రపతి ఆదేశం అందేలోగా ఏవైనా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ భావించినట్లయితే అలాంటి చర్యలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉంటుంది.
- ఆర్టికల్ 239ఏఏ(5) ప్రకారం ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. సీఎం సలహా మేరకు ఇతర మంత్రులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఇష్టం మేరకు మంత్రులు తమ పదవుల్లో కొనసాగుతారు.
- ఆర్టికల్ 239ఏబీ(బి) ప్రకారం జాతీయ రాజధాని ప్రాంత సక్రమ పరిపాలనకు, జాతీయ రాజధాని భూభాగాన్ని పాలించడానికి అవసరమైన, ఉపయోగకరమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టవచ్చు.
లెఫ్టినెంట్ గవర్నర్ వివాదం
ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తిస్థాయి అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో పాలనాధిపతి లెఫ్టినెంట్ గవర్నరే అని ఢిల్లీ హైకోర్టు 2016న తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదు. మంత్రిమండలి సలహా మేరకు ఆయన నడుచుకోవాలని సుప్రీంకోర్టు 2018, జులైలో తీర్పు చెప్పింది.