
వరంగల్ : అధికార టీఆర్ఎస్పార్టీకి చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రైవేట్ పీఏ శివపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. సిద్దిపేట జిల్లాకు చెందిన దళిత యువతి హన్మకొండ బాలసముద్రం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఐదు సంవత్సరాల లా కోర్స్ చదువుతోంది. మూడు రోజుల క్రితం హాస్టల్ వార్డెన్ వేముల శోభ ఒక విషయమై మాట్లాడే పని ఉందంటూ.. యువతిని అలంకార్ ప్రాంతంలోని తన నివాసానికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో హనుమకొండ చౌరస్తాలో మెడికల్ షాప్ నిర్వహించే సదరు మహిళ బంధువు కోట విజయ్, ఎమ్మెల్యే నరేందర్ పీఏ వేముల శివ ఆ ఇంటికి వచ్చారు. అక్కడే ఆ యువతి పై వారిద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
విషయం తెలిసిన బాలిక బంధువులు హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ముగ్గురిపై పోలీసులు 506, 376, 109 సెక్షన్ల కింద అత్యాచార, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. హన్మకొండ ఏసీపీ కిరణ్ కుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి నిందితుల వివరాలు బయటకు రాకుండా పోలీసు శాఖ గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా సాధ్యం పడలేదని ప్రచారం జరుగుతోంది.
యువతిని సహజంగానే కేసు పెట్టకుండా ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..ఈ మొత్తం వ్యవహారంలో హాస్టల్ నిర్వాహకురాలి పాత్రే చాలా కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఈ కేసు ఆధారంగా తీగ లాగితే మరిన్ని కోణాలు, కొంతమంది ప్రముఖుల వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.