
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ మంచిర్యాల యూత్ టౌన్ జనరల్ సెక్రెటరీ గడప రాకేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ తో విచక్షణారహితంగా కొట్టారు. ఆయన కారును ధ్వంసం చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్ మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. స్థానిక హైటెక్ సిటీ కాలనీలో ఉంటున్న రాకేశ్ ఉదయం 5:30 గంటలకు జిమ్ కు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారును వెనక నుంచి ఢీకొట్టారు. ఏం జరిగిందోనని ఆయన కిందకు దిగేసరికి బైకులపై వచ్చిన దాదాపు 15 మంది వ్యక్తులు రౌండప్ చేశారు. హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ తో దాడి చేశారు. ఈ దాడిలో రాకేశ్ చేతులకు ఫ్రాక్చర్ కాగా, కారు ధ్వంసమైంది. గమనించిన స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మంచిర్యాల ఎమ్మెల్యే సన్నిహితుడు జగన్మోహన్రావు అనుచరులే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని రాకేశ్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హైదరాబాద్ నుంచి మంచిర్యాల వచ్చి రాకేశ్ను పరామర్శించారు. జగన్ మోహన్ రావు అనుచరులే దాడి చేశారని ఆరోపించారు. దాడి కేసులో పోలీసులు పెంటిక్ రవి, ఆత్మకూరి సంజు, సాయి అండ్ అదుర్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.