
చుంచుపల్లి, వెలుగు : పోలీసులమంటూ బెదిరించి స్టూడెంట్లపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కొత్తగూడెం మండలానికి చెందిన ముగ్గురు స్టూడెంట్స్ ఈ నెల 4న రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ జంక్షన్ వద్ద హైవేపై రీల్స్ చేస్తున్నారు.
ఈ టైంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ‘మేము పోలీసులం, మీరు ఇక్కడ ఫొటోలు ఎందుకు దిగుతున్నారు ? మీరు గంజాయి బ్యాచ్ అని అనుమానంగా ఉంది’ అంటూ స్టూడెంట్ల ఫొటోలు తీయడమే కాకుండా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఐడీ కార్డ్స్ చూపించాలంటూ నిలదీయడంతో నలుగురు వ్యక్తులు స్టూడెంట్లపై దాడి చేశారు. అక్కడి నుంచి పాయిపోయిన స్టూడెంట్స్ ఈ నెల 6న టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు స్టూడెంట్లను బెదిరించి, వారిపై దాడి చేసింది చుంచుపల్లి మండలం పెనగడప గ్రామానికి చెందిన ఎస్కే. యాకూబ్ గౌరి, ఎగ్గడి అశోక్, వడ్డే మనోజ్, పులిచర్ల శరత్ చంద్రగా గుర్తించి బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని సీఐ రమేశ్ తెలిపారు.