
కమలాపూర్, వెలుగు : తొలి ఏకాదశి పండుగ కోసం రైలులో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్వేర్ఎంప్లాయ్ ఫోన్ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి చనిపోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు, కొడుకు శ్రీకాంత్(25) ఉన్నారు. వ్యవసాయదారులైన రాములు దంపతులు కష్టపడి శ్రీకాంత్ను చదివించారు.
వారనుకున్నట్టే చదువు పూర్తి చేసిన శ్రీకాంత్ హైదరాబాద్ ఇన్పోసిస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్సంపాదించాడు. అక్కడే ఉంటున్న శ్రీకాంత్ తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ నుంచి బుధవారం శాతవాహన ఎక్స్ప్రెస్లో ఖాజీపేటకు బయలుదేరాడు. రష్ ఎక్కువగా ఉండడంతో డోర్ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. బీబీనగర్ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిని కర్రతో కొట్టారు. కింద పడబోతున్న ఫోన్ను పట్టుకోబోయిన శ్రీకాంత్ తీవ్ర గాయాలతో చనిపోయాడు.