చెన్నై సిటీలో ఇప్పుడు పానీ పూరీ బండ్లు కనిపించటం లేదు.. కొన్ని రోజులుగా బంద్ పెట్టారు వ్యాపారులు. పానీపూరీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న వార్తలతో.. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిటీలోనే 56 పానీపూరీ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో బెంబేలెత్తిన పానీపూరీ చిరు వ్యాపారులు తమ షాపులను క్లోజ్ చేస్తున్నారు. కొన్ని రోజులు మూసేసి.. అంతా సర్దుకున్నాక తెరవచ్చు అంటున్నారు. దీంతో చెన్నై సిటీలో ఈవినింగ్ అయితే వేల సంఖ్యలో.. రోడ్ల పక్కన దర్శనం ఇచ్చే పానీపూరీ బండ్లు.. ఇప్పుడు కొద్ది సంఖ్యలో కనిపిస్తున్నాయి.
చెన్నై ఫుడ్ సేఫ్టీ అధికారులు జులై 5న మెరీనా బీచ్ లోని పలు ప్రాంతాల్లోని ఆకస్మిక తనిఖీలు చేశారు. పానీపూరీ,మసాలా,చాట్,ఆహారంలో ఉపయోగించే పదార్థాల శాంపిల్స్ తీసుకున్నారు. తమిళనాడు , కర్ణాటకతో సహా పలు ప్రాంతాల నుంచి సేకరించిన పానీపూరి శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నామని చెన్నై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సతీష్ కుమార్ తెలిపారు. దీని రిజల్ట్ 3లేదా 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు.
రిపోర్టులో ఏదైనా కల్తీ పధార్థాలు వాడినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా ప్రజారోగ్య ప్రమాదాలను నివారించడానికి రద్దీగా ఉండే ప్రదేశాలలో పానీ పూరీ విక్రయదారులపై నిఘా పెంచినట్లు చెప్పారు. ఈ రిపోర్ట్ ఆధారంగా తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా పానీపూరిని నిషేదించాలని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే ప్రజలందరూ ఒట్టి చేతులతో పానీపూరి తినకూడదని డాక్టర్ కుమార్ తెలిపారు. పానీపూరి తయారీలో మితిమీరిన రంగుల నీటిని తీసుకోకుండా ఉండాలని కోరారు. అలాగే పానీపూరి అమ్మేవారు చేతికి గ్లౌజులు, టోపీలు ధరించాలని సూచించారు.