
పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్ధం కోసం బ్లడ్ ప్రెషర్ టెల్లింగ్ మిషన్ (బీటీఎం) లు ప్రారంభించింది ఆస్పత్రి యాజమాన్యం. ఆసుపత్రి సెక్యూరిటీ కార్యాలయం ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానంతో పని చేసే ఆటోమేటిక్ బీపీ టెల్లింగ్ మిషన్ (BTM) యంత్రాలను ఏర్పాటు చేయించారు. వీటి కోసం ప్రత్యేకంగా చిన్నపాటి గదిని సిద్ధం చేయించి, టెస్టింగ్ సమయంలో రోగి కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయించారు. ఇందులో రోగి చేతిని ఉంచితే ఆటోమేటిక్ గా బీపీ, పల్స్ తో పాటు తేది , సమయంతో రిసిప్ట్ వస్తుంది. ఇది ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
వేం చారిటబుల్ ట్రస్టు సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఐశ్వర్య రెడ్డి ఈ మిషన్లను విరాళంగా ఇచ్చారు. వీటితో పాటు రూ.12 లక్షల విలువైన యంత్రాలు, ట్రాలీలు, పది ఎయిర్ కూలర్ లు, ఆసుపత్రికి వస్తువులను తరలించేందుకు వీలుగా 13 ట్రాలీలులను అందించారు. ఏప్రిల్ 19న ఉదయం నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ , వైద్యులతో కలిసి ఐశ్వర్య రెడ్డి ఈ యంత్రాలను ఆవిష్కరించారు.