
న్యూఢిల్లీ: ఐపీఎల్ 18వ సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ సీనియర్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను కెప్టెన్గా ప్రకటించింది. కేఎల్ రాహుల్, డుప్లెసిస్, మిచెల్ స్టార్క్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ 2019 నుంచి టీమ్లో కీలక ప్లేయర్ ఉన్న అక్షర్కే పగ్గాలు ఇచ్చింది. ఈ సీజన్లో ఢిల్లీ రూ. 16.50 కోట్లతో అతడిని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్లో అక్షర్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి.
కానీ, దేశవాళీ క్రికెట్లో గుజరాత్ జట్టును సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నీల్లో నడిపించాడు. గతేడాది నుంచి ఇండియా టీ20 టీమ్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ‘డీసీ కెప్టెన్గా ఎంపిక కావడం గౌరవంగా అనిపిస్తోంది. జట్టు యాజమాన్యం, సపోర్ట్ స్టాఫ్ నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు. గత ఆరు సీజన్లుగా ఈ ఫ్రాంచైజీలో ఉన్న నేను క్రికెటర్గా, వ్యక్తిగా ఎదిగాను. ఇప్పుడు కెప్టెన్గా జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అక్షర్ పేర్కొన్నాడు.