
హైదరాబాద్, వెలుగు: అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ (ఏవైసీఏ), తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ రూరల్) అండర్-17 క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 24 నుంచి హైదరాబాద్లో జరగనుంది. ఏవైసీఏ టీమ్తో టీడీసీఏ రూరల్ వారియర్స్, రూరల్ రైజర్స్, రూరల్ పాంథర్స్ 50 ఓవర్ల ఫార్మాట్లో పోటీపడనున్నాయి. ఈ టోర్నీట్రోఫీ, జెర్సీలను రాష్ట్ర డీజీపీ జితేందర్ గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు విదేశీ జట్టుతో తలపడే అవకాశం కల్పించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. రూరల్ లెవెల్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న టీడీసీఏను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, అమెరికన్ యూత్ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ అరుణ్ కొలిపాక తదితరులు పాల్గొన్నారు.