యూపీ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ కొడుకు అజిత్ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేశారని ఆరోపణలతో పోలీసులు కేసు నమోదుచేసినట్లు తెలిపారు. కొత్వాలి పీఎస్ లో రవి తివారీ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐర్ నమోదయ్యింది.
భూమి కొనుగోలుకు సంబంధించి కమీషన్ విషయంలో అజిత్ ప్రసాద్, రాజు యాదవ్ మరి కొందరు వ్యక్తులు సెప్టెంబర్ 22న మధ్యాహ్నం ఫైజాబాద్లోని ఎస్బిఐ బ్రాంచ్ సమీపంలో తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని ఫిర్యాదుతో తెలిపాడు బాధితుడు రవి తివారీ. తనపై దాడి చేస్తూ రఖాబ్ గంజ్ వైపు తీసుకెళ్లారని చెప్పారు. తన నుంచి లక్ష రూపాయలు బలవంతంగా లాక్కున్నారని.. నిందితుల దాడికి సంబంధించిన వీడియోను రికార్డ్ చేశానని రవి తివారీ ఆరోపించారు. అజిత్ ప్రసాద్.. స్థానిక భూ యజమాని షీట్ల ప్రసాద్ మధ్య భూ ఒప్పందానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తివారీ పేర్కొన్నారు . ఈ మేరకు అజిత్ ప్రసాద్, రాజు యాదవ్ తో పాటు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్ను ఓడించి అవధేష్ ప్రసాద్ సంచలనం సృష్టించారు.