
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టి, భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క లీడ్ రోల్స్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రీ రిలీజ్కు రెడీ అవుతోంది. సోమవారంతో ‘బాహుబలి 2: ది కన్క్లూజన్’ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ ‘బాహుబలి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘ఈ ఏడాది అక్టోబర్లో భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదు.. అభిమానులకు ఈ ఏడాది ఓ వేడుకలా గుర్తుండిపోవాలి. పాత జ్ఞాపకాలు, కొత్త విశేషాలతో పాటు ఇంకొన్ని అద్భుతమైన సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి’ అని శోభు చెప్పారు. అప్పట్లోనే రికార్డులు సృష్టించిన ఈ చిత్రం రీ రిలీజ్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారా లేక రెండో భాగం రిలీజ్ను కూడా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో అడ్వెంచర్ మూవీని తెరకెక్కించే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు.