
జోగిపేట, వెలుగు : తాను నియోజకవర్గంలో చెరువులు అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆందోల్బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబూమోహన్ ఆరోపించారు. సోమవారం నామినేషన్ మొదటిసెట్తన కార్యకర్తల ద్వారా దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో తాను చేసిన డెవలప్మెంట్మాత్రమే ఉందని ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ది జరగలేదన్నారు.
తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తానొక సేవకునిగా పనిచేశానే తప్ప ఎమ్మెల్యేగా ఏ రోజు గర్వపడలేదన్నారు. మిషన్ భగీరథ పథకం కంటే ముందే సింగూర్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించిన విషయం గుర్తుచేశారు.
రవాణ సదుపాయం ఉన్నపుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశ్యంతో ప్రతి గ్రామానికి రోడ్లు వేయించినట్లు వివరించారు. అవినీతికి పాల్పడను, అబద్ధమాడను బీజేపీకి ఓటేసి తనను తప్పక గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో జగన్నాధం, సుమన్, సంతోశ్, శివశంకర్ పాల్గొన్నారు.