
రకరకాల వంటలు తినాలని అందరికీ ఉంటుంది. అలాగే తమకు ఇష్టమైన వాళ్లకు చేసి పెట్టాలని కూడా చాలామందికి ఉంటుంది. కాకపోతే ఎలా చేయాలో తెలియక ఆగిపోతారు కొందరు. కావాల్సిన పదార్థాలు, చేయాల్సిన పద్ధతి తెలియాలె గానీ చేయడం ఎంత సేపు. శరీరానికి పోషకాలు అందించే బేబీ ఆలూతో టేస్టీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .
- కావాల్సినవి: చిన్న ఆలుగడ్డలు (బేబీ ఆలూ అని మార్కెట్లో దొరుకుతాయి): అరకిలో
- పసుపు: చిటికెడు
- పెరుగు: ఒక కప్పు
- చాట్ మసాలా : ఒక టేబుల్ స్పూన్
- గరం మసాలా: ఒక టీస్పూన్
- టొమాటో గుజ్జు : అర కప్పు
- కారం : ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: తగినంత
- నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
- నూనె: సరిపడా
- కొత్తిమీర తరుగు : పావు కప్పు
తయారీ విధానం: ఆలుగడ్డలను ఉడకబెట్టి పక్కన పెట్టాలి. తర్వాత వాటి పొట్టు తీసి, ఫోర్క్ తో అక్కడక్కడ గాట్లు పెట్టాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి పావుగంట పాటు నానబెట్టాలి. మరో గిన్నెలో పెరుగు, చాట్ మసాలా, పసుపు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత పక్కన పెట్టిన ఆలుగడ్డలను వేయాలి. స్టవ్ వెలిగించి పాన్లో నూనె వేడి చేయాలి. అది వేగాక ఆలుగడ్డల మిశ్రమం వేయాలి. రెండు నిమిషాల తర్వాత టొమాటో గుజ్జు వేసి మూత పెట్టాలి. మిశ్రమం దగ్గరికయ్యాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి. గ్రేవీ కావాలంటే... టొమాటో గుజ్జుతో పాటు కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. ఈ కూర అన్నం లేదా చపాతీలతో తింటే మళ్లీ.. మళ్లీ తినాలనిపిస్తుంది.
►ALSO READ | అక్షయ తృతీయరోజున ఏరాశి వారు బంగారం కొనాలి.. ఏ రాశి వారు వెండి కొనాలి...