బాచుపల్లి పీఎస్​లో హరీశ్ రావుపై కేసు

బాచుపల్లి పీఎస్​లో హరీశ్ రావుపై కేసు
  • చక్రధర్​ ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు
  • తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు 

జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రగతినగర్ సాయి పార్క్​వ్యూ అపార్ట్​మెంట్​లో ఉంటున్న చక్రధర్ ​గౌడ్  ఫిర్యాదుతో నమోదు చేశారు.  గతంలో చక్రధర్​ తన ఫోన్​ ట్యాపింగ్​కు గురైందని, ఇందుకు కారణం హరీశ్​రావు, రిటైర్డ్​పోలీస్​ ఆఫీసర్ రాధాకిషన్​రావుతో పాటు మరికొందరు కారణమంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  కేసు నమోదు చేశారు.

 దర్యాప్తులో ఉండగానే, హరీశ్​రావు, రాధాకిషన్​ హైకోర్టును ఆశ్రయించగా..  అరెస్ట్ ​చేయొద్దని  ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ కేసులో ఏ3గా  వంశీకృష్ణ, ఏ4గా  సంతోష్​ ​కుమార్​, ఏ5 పరశురాములను అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు జుడీషియల్​కస్టడీకి పంపింది. అనంతరం బెయిల్ పై గత నెల 21న విడుదలైన వంశీకృష్ణ మీడియా మాట్లాడుతూ తనపై రివేంజ్ ​తీసుకుంటానని,  అతని స్టేట్ మెంట్ ఆధారంగా తనకు  హరీశ్​రావుతో ప్రాణహాని ఉందని చక్రధర్ తాజా ఫిర్యాదులో ఆరోపించారు.

వంశీకృష్ణ సాక్షులను ప్రభావితం చేసేలా కూడా మాట్లాడాడని పేర్కొన్నాడు.  దీంతో  వంశీకృష్ణ, హరీశ్​రావు, సంతోశ్​కుమార్​, పరశురాములపై చర్యలు తీసుకోవాలని  కోరాడు.  దీంతో  హరీశ్​రావును ఏ2గా, ఏ1గా  వంశీకృష్ణ, ఏ3గా సంతోష్​​కుమార్​, ఏ4గా పరుశురాములపై  బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.