
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్ ముంగిట ఇండియా బ్యాడ్మింటన్ టీమ్కు షాక్ తగిలింది. డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆనారోగ్యం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సోమవారం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి మే 4 వరకు చైనా లోని షియామెన్లో జరగనున్న ఈ మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో ఇండియా అవకాశాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
సాత్విక్–చిరాగ్ స్థానంలో జట్టులో ఎవ్వరినీ చేర్చలేదని బాయ్ తెలిపింది. దాంతో హరిహరణ్ – రూబన్ కుమార్ జోడీ మెన్స్ డబుల్స్లో ప్రాతినిధ్యం వహించనుంది. కాగా, గాయాల కారణంగా ఇప్పటికే విమెన్స్ జంట పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ ఈ టోర్నీకి దూరంగా ఉంటోంది. ఓవరాల్ వరల్డ్ ర్యాంక్తో ఈ టోర్నీకి క్వాలిఫై అయిన ఇండియా కఠినమైన గ్రూప్–డిలో మాజీ చాంపియన్ ఇండోనేసియా, రెండు సార్లు రన్నరప్ డెన్మార్క్, బలమైన ఇంగ్లండ్తో బరిలోకి దిగనుంది.