పాక్​ ఆర్మీ కాన్వాయ్​పై సూసైడ్​ ఎటాక్

పాక్​ ఆర్మీ కాన్వాయ్​పై సూసైడ్​ ఎటాక్
  • 11 మంది మృతి.. 22 మందికి గాయాలు.. నలుగురు టెర్రరిస్టులను చంపేశామన్న ఆర్మీ 
  • 90 మందిని చంపేశామన్న  బలూచ్​ మిలిటెంట్లు
  • భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్​తో
  • కాన్వాయ్​లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్
  • ఒక బస్సు తునాతునకలు.. తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు
  • పేలుడు తర్వాత వెహికల్స్​పై టెర్రరిస్టుల కాల్పులు
  • పాకిస్తాన్​లో ఒక్కరోజే 19 చోట్ల దాడులు

క్వెట్టా,కరాచీ: పాకిస్తాన్​లోని బలూచిస్తాన్​లో మిలటరీ కాన్వాయ్ పై భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారని పాక్​ఆర్మీ ప్రకటించింది. ఆదివారం బలూచిస్తాన్​ లోని నౌష్కి జిల్లాలో జరిగిన ఈ సూసైడ్​ఎటాక్​కు బాధ్యులం తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. అయితే తాము ఈ దాడిలో మొత్తం 90 మంది సైనికులను చంపేశామని పాక్​లోని వివిధ మీడియా సంస్థలకు పంపించిన ఈ–మెయిల్​లో తెలిపింది.

తమ ఆత్మాహుతి దళం మాజిద్​బ్రిగేడ్, గెరిల్లా దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్​ నిర్వహించినట్టు పేర్కొన్నది. జాఫర్ ఎక్స్​ప్రెస్ హైజాక్ ఘటన తర్వాత వారం రోజుల్లోపే మరో పెద్ద ఘటన చోటుచేసుకోవడం, ఒక్క శనివారమే పాక్ ఆర్మీ, పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా మొత్తం 19 దాడులు జరగడంతో పాక్​ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

దెబ్బతిన్న మూడు బస్సులు

బలూచిస్తాన్​లోని క్వెట్టా నుంచి తఫ్తాన్​కు ఎనిమిది బస్సులు, రెండు కార్లతో కూడిన ఫ్రాంటియర్ కార్ప్ (ఎఫ్సీ) పారామిలిటరీ కాన్వాయ్​బయల్దేరింది. నౌష్కి జిల్లాలోని రఖ్షాన్ మిల్స్ సమీపంలో హైవేపై సైనికుల కాన్వాయ్​ను పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సూసైడ్ బాంబర్ ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించి ఒక బస్సు తునాతునకలవగా.. మరో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో టెర్రరిస్టులు కాన్వాయ్​పై కాల్పులు జరపగా సైనికులు కౌంటర్ చేశారని దీంతో నలుగురు టెర్రరిస్టులు మృతిచెందినట్టు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతిచెందారని.. 22 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతదేహాలను, క్షతగాత్రులను హెలీకాప్టర్​లో ఆసుపత్రికి తరలించినట్టు నౌష్కి జిల్లా పోలీస్ ఆఫీసర్ జాఫర్ తెలిపారు. ఈ దాడిని ప్రధాని షాబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఖండించారు.

మాజిద్​బ్రిగేడ్.. ఫతే స్క్వాడ్ కలిసి దాడి

కాన్వాయ్​పై ఆత్మాహుతి దాడిని తామే చేశామని బీఎల్​ఏ పాక్​లోని కొన్ని మీడియా సంస్థలకు ఈ–మెయిల్​ద్వారా వెల్లడించింది. తమ ఫిదాయీ యూనిట్ మాజిద్​బ్రిగేడ్, గెరిల్లా పోరాట దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా దాడికి పాల్పడ్డాయని తెలిపారు. ఈ ఎటాక్​లో 90 మంది సైనికులను చంపేశామని వెల్లడించింది. 

సూసైడ్​బాంబర్ తన వెహికల్​తో ఢీకొట్టిన బస్సు పూర్తిగా ధ్వంసం అయిందని.. అదే సమయంలో ఫతే స్క్వాడ్ యోధులు ఒక బస్సును చుట్టుముట్టి అందులో ఉన్న వారందరిని అంతమొందించారని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

ఒక్కరోజే పెద్దసంఖ్యలో దాడులు

శనివారం పాక్​లోని వివిధ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు, ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా పెద్దఎత్తున దాడులు జరిగాయి. బలూచిస్తాన్​ రాజధాని క్వెట్టాలో జరిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎఫ్) సిబ్బంది ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. 

కరని ప్రాంతంలోని బరోరి రోడ్డులో ఏటీఎఫ్ పెట్రోలింగ్ వాహనం టార్గెట్​గా ఈ పేలుడు సంభవించింది.  ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు అధికారులు గాయపడ్డారు. ఇదే రీతిలో పలు చోట్ల ఎటాక్స్ జరిగినట్టు మీడియాలో వార్తలు వెలువడడం ప్రజల్లో ఆందోళన కలిగించింది.