
- బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
- డెడ్లైన్ ముగిసినా పాక్ స్పందించలేదని విమర్శ
- ఆపరేషన్ సక్సెస్ అంటూ అబద్ధం చెబుతోందని ఫైర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ప్యాసింజర్ ట్రైన్ను హైజాక్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేసినట్టు వెల్లడించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల సమయం ముగియడంతోనే ఈ పని చేశామని తెలిపింది. ఆపరేషన్ ముగిసిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను బీఎల్ఏ ఖండించింది. ‘‘మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సర్కారుకు 48 గంటల సమయం ఇచ్చాం. కానీ, పాక్ సర్కారు మొండితనంగా సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. దీంతో మా చెరలో ఉన్న 214 మంది బందీలను హతమార్చాం” అని బీఎల్ఏ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగానే..
తామెప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తామని బీఎల్ఏ పేర్కొన్నది. పాకిస్తాన్సైన్యం వారి సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా తమతో పోరాటానికి సిద్ధమైందని, ఫలితంగానే బందీలను కోల్పోయిందని తెలిపింది. జాఫర్ఎక్స్ప్రెస్ బోగీల్లోకి ఎస్ఎస్జీ కమాండోలు రాగా.. తమ బీఎల్ఏ సిబ్బంది వారిపై భీకర దాడి చేసినట్టు చెప్పింది. ఈ దాడిలో ఎస్ఎస్జీ కమాండోలతోపాటు బందీలు చాలామంది ప్రాణాలు కోల్పోయారని, తమ సభ్యులు చివరి బుల్లెట్ వరకూ పోరాడారని పేర్కొన్నది. బీఎల్ఏకు చెందిన 12 మంది సిబ్బంది ప్రాణాలొదిలారని తెలిపింది. అయితే, చనిపోయిన తమ బీఎల్ఏ సభ్యుల డెడ్బాడీలను చూపించి.. విజయం సాధించామని పాక్సర్కారు వాస్తవాలను దాచిపెడుతున్నదని మండిపడింది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదని, ఆక్రమిత ప్రాంతాల్లో తమ సిబ్బంది ఇంకా పోరాడుతున్నారని పేర్కొన్నది. హైజాక్ సమయంలో మరణించిన తమ సభ్యులకు బీఎల్ఏ సంస్థ నివాళులర్పించింది.