
జమ్మూ: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో ఆర్మీ యూనిఫామ్ల విక్రయం, కుట్టడం, నిల్వలపై అధికారులు నిషేధం విధించారు. దేశ వ్యతిరేక శక్తులు ఆర్మీ యూనిఫామ్లను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం దాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లు ధరించి అటాక్స్ చేయడంతో అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు. ఈ మేరకు శనివారం కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కొన్ని నిబంధనలు, ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మీ యూనిఫామ్ ల కొనుగోళ్లు, నిల్వ, విక్రయాలు చేసే అన్ని దుకాణాలు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. యూనిఫామ్ల అమ్మకాలపై ప్రతి15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన సైన్యం, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది వివరాలు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ లిస్ట్ను డీలర్ లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు 15 రోజులకు ఒకసారి అందిస్తారు.