
హుస్నాబాద్, వెలుగు : సంయుక్త కిసాన్మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపుతో గ్రామీణ భారత్ బంద్ ప్రభావం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లోని పల్లెల్లో పాక్షికంగా కనిపించింది. అనేక చోట్ల రైతు వ్యవసాయ, కార్మిక సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలిపాయి. కొన్నిచోట్ల రాస్తారోకోలు, మరికొన్నిచోట్ల ధర్నాలు నిర్వహించారు. వాణిజ్య రవాణా, ట్రక్ యూనియన్లు బంద్లో పాల్గొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలతో దేశంలో అనేకమంది నష్టపోతున్నారని ఆయా సంఘాల నాయకులు విమర్శించారు. హుస్నాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ, బీఎస్పీ, రైతు ఐక్య వేదిక సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వివిధ ప్రాంతాలు, చౌరస్తాలు, బస్టాండ్ల దగ్గరకు చేరుకున్న వామపక్షాలు, రైతు సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలకు దిగారు.
రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి శంకర్, రైతు సంఘం ఐక్య వేదిక నాయకుడు రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెంకన్న, పాలకేంద్రం డైరెక్టర్ మల్లేశం, కనకయ్య, వెంకటయ్య, మల్లయ్య పాల్గొన్నారు.