అప్పుడు ఎల్ఆర్ఎస్​ ఉచితమని.. ఇప్పుడు పైసలు వసూలు చేస్తరా? : బండి సంజయ్​

 అప్పుడు ఎల్ఆర్ఎస్​ ఉచితమని.. ఇప్పుడు పైసలు వసూలు చేస్తరా? : బండి సంజయ్​

50 వేల కోట్ల దోపిడీకి సర్కారు స్కెచ్: బండి సంజయ్​
ముస్లింలను బీసీల్లో కలిపితే ఆమోదించేది లేదని వెల్లడి

పెద్దపల్లి, వెలుగు: ఎల్ఆర్ఎస్​ ఉచితంగా చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత పైసలు వసూలు చేయడానికి సిద్ధమైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.  ఎల్ఆర్ఎస్​ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్​ వేశారని ఆరోపించారు. 

వచ్చే కాలంలో కాంగ్రెస్​ ప్రభుత్వం  బర్త్​, డెత్​ రెగ్యులరైజేషన్​ స్కీమ్​లను కూడా ప్రవేశపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు.  శుక్రవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో  గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల తరఫున బండి సంజయ్​ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ  ముస్లింలను బీసీల్లో కలిపే ప్రయత్నం  చేస్తున్నదని,  కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

కులగణన సర్వేలో బీసీల సంఖ్యను  తక్కువగా చూపించారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని ,  10 శాతం  ముస్లింలను బీసీల్లో కలిపితే  బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 32 శాతమేనని అన్నారు.   బీసీ రిజర్వేషన్ల కోసం 10 జనపథ్​ ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్​ నేతలకు సవాల్​ చేశారు. దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తున్నదని బండి సంజయ్​ అన్నారు. . తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు  కాంగ్రెస్​ నమ్మక ద్రోహానికి, బీజేపీ విశ్యాసానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు.  టీచర్​ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్​ అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్​బాబు, వెంకటరమణారెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి పాల్గొన్నారు.